Odisha Love Marriage: కులాంతర వివాహం.. 40 మందికిశిరోముండనం చేయించిన గ్రామ పెద్దలు..
పెళ్లి చేసుకున్న కొత్త జంటకు పెద్దకర్మ చేసి.. జంతబలి ఇచ్చిన గ్రామస్తులు..;
తమ గ్రామానికి చెందిన యువతి వేరొక కులానికి చెందిన యువకుడిని లవ్ మ్యారేజ్ చేసుకోగా.. ఊరి నుంచి వెలివేతను తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు 40 మంది గుండు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన అమానవీయ ఘటన ఒడిశాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక గోరఖ్పూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ అమ్మాయి, షెడ్యూల్డ్ కులానికి చెందిన అబ్బాయినీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, యువతి తరఫు వారు ఈ వివాహానికి అంగీకరించక పోవడంతో ఇద్దరూ మూడు రోజుల క్రితం లేచిపోయి పెళ్లి చేసేసుకున్నారు.
అయితే, గురువారం నాడు వచ్చిన లేచిపోయి పెళ్లి చేసుకున్న జంట గ్రామానికి రావడంతో విషయం తెలిసిన పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి ఫ్యామిలీ సభ్యులను గ్రామ బహిష్కరణ చేశారు. దీని నుంచి తప్పించుకోవాలంటే శిక్షగా గుండు చేసుకుని, మూగ జీవాలను బలిచ్చి, కొత్త జంటకు పెద్ద కర్మ చేయాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. దీంతో యువతి తరపు కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో 40 మంది పురుషులు గుండు చేయించుకుని మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, ఆ కొత్తకు పెద్దకర్మ కూడా చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులను ప్రశ్నించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలియజేశారు.