పవిత్ర అమర్నాథ్ యాత్రకు హాజరయ్యే యాత్రికుల భద్రత దృష్ట్యా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్లే అన్ని మార్గాలను జులై 1 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ‘నో-ఫ్లయింగ్ జోన్’గా ప్రకటిస్తూ కేంద్రపాలిత ప్రాంత హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అమర్నాథ్ యాత్ర జులై 3న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనుంది. భద్రతా పరంగా అత్యంత సున్నితమైన ఈ యాత్ర నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తీవ్రవాద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు అందాయి. యాత్రికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు భద్రతా దళాలు ‘ఆపరేషన్ శివ’ను ప్రారంభించాయి. పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో యాత్రికులకు రక్షణ కల్పించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం.