పాకిస్తాన్ దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టిన భారత సరిహద్దు భద్రతా దళాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఇటీవల చేప ట్టిన సైనిక ఆపరేషన్ సమయంలో పాక్లోని 118 పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయని, వారి సమాచార, నిఘా నెట్వర్క్ ను కూల్చివేశాయన్నారు. మన బీఎస్ఎఫ్ కొట్టిన దెబ్బకు శత్రుదేశం ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని, వాళ్లకు కోలుకునేందుకు చాల ఏళ్లు పట్టే అవకాశం ఉన్నదన్నారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టి 118 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసినందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ను ప్రశంసించారు. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నుంచి తనకు అందించిన సమాచారం ప్రకారం.. పాక్ సైనిక సమాచార, నిఘా వ్యవస్థలకు భారీ దెబ్బ తగిలిందన్నారు. కొంతకాలం పూర్తి సమాచార ఆధారిత యుద్ధాన్ని చేసే పరిస్థితిలో వారు లేరన్నారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ సంసిద్ధతపై అమిత్ షా ప్రశంసలు కురిపించారు.
అప్రమత్తంగా ఉంటూ స్పష్టమైన వ్యూహాలను విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు అమిత్ షా. భారతదేశ సరిహద్దులపై వ్యవస్థీకృతంగా లేదా అసంఘటితంగా, రహస్యంగా లేదా బహిరంగంగా దాడి జరిగినప్పుడల్లా ముందుగా భారాన్ని భరించేది మన బీఎస్ఎఫ్ జవాన్లే అని కొనియాడారు. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా జమ్మూకశ్మీర్ లో ప్రారంభమైన అభివృద్ధి కొనసాగుతుందని అమిత్ ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం రెండు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారిగా శుక్రవారం జమ్మూకాశ్మీర్లో అమితా పర్యటించారు. అమర్నాథ్ యాత్ర సందర్భంగా యాత్రీకుల భద్రతకు తీసుకుంటున్న భద్రతా చర్యలను అమిత్ షా సమీక్షించారు. ఫూంచ్ జిల్లాలో పర్యటించిన అమిత్ షా, పాకిస్తాన్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ దాడుల్లో మరణించినవారి కుటుంబాలను పరామర్శించిన అమిత్ షా.. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం బాధిత కుటుంబాల్లోని యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.