Ahmedabad Plane Crash: ప్రమాదానికి పైలెట్ సుమిత్ ఐదు సెకన్ల మెసేజ్
మేడే కాల్ ఇచ్చిన వెంటనే విమానం కూలిపోయింది;
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలెట్ సుమిత్ లాస్ట్ మెసేజ్ ఇచ్చారు. ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటికొచ్చింది. పైలెట్ సుమిత్ ఐదు సెకన్ల మెసేజ్ ఇచ్చారు. మేడే, మేడే, మేడే అంటూ మెసేజ్ అందించారు సుమీత్. ‘మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్’ అంటూ తెలిపారు. మేడే కాల్ ఇచ్చిన వెంటనే విమానం కూలిపోయిందని ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. సుమిత్ సబర్వాల్ కాల్ చేసినట్లు ఏటీసీలో రికార్డ్ అయిందని స్పష్టం చేశారు.
కాగా.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన మృతుల సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. మెడికోలు, స్థానిక ప్రజలు కలిసి మొత్తం ఆ సంఖ్య 274కు చేరినట్లు పేర్కొంది. విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహం ఉంది. తొలుత 24 మంది మృతి చెందగా.. తాజాగా చికిత్స పొందుతూ మరో 9 మంది చనిపోయారు. ఇప్పుడా సంఖ్య 33కు పెరిగింది. మొత్తంగా మృతుల సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
ఎయిర్ ఇండియా విమానం, బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ఈ ప్రమాదానికి గురైంది. 2011లో వాణిజ్యపరంగా అరంగేట్రం చేసిన తర్వాత 787 ప్రమాదంలో ఇది మొదటి ప్రాణాంతక ప్రమాదం. ఈ విషాదం ఇప్పటివరకు 270 మంది ప్రాణాలను బలిగొంది. విమాన ప్రమాదాలు, సంఘటనలను పరిశోధించే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB), విషాదం జరిగిన 28 గంటల తర్వాత ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానం తోక దగ్గర ఉన్న నారింజ రంగు పరికరం ప్రమాదంపై దర్యాప్తు చేయడంలో సహాయపడుతుంది. ఈ ఘోర ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8/9 అన్ని విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టారు.