Z-Morh Tunnel:నేడు జడ్‌-మోడ్‌ సొరంగం ప్రారంభం

జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే అవకాశం;

Update: 2025-01-13 03:00 GMT

ప్రధాని మోదీ నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్నారు. సోన్‌మార్గ్‌ ప్రాంతంలో జడ్‌ మోడ్‌ సొరంగాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై రూ.2,400 కోట్లతో దీన్ని నిర్మించారు. ఈ సొరంగం 6.5 కి. మీ. పొడవు ఉంది. ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రహదారి మార్గం ద్వారా చేరుకోవడానికి వీలవుతుంది. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. ప్రధాని రాక వేళ భద్రత కట్టుదిటం చేశారు.

ప్రత్యేకతలు ఇవే..

ప్రధాని ప్రారంభించనున్న జెడ్ మోడ్ టన్నెల్‌ భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. 8,500 అడుగుల ఎత్తులో ఉన్న, 6.5 కి. మీ పొడవైన ఈ వ్యూహాత్మక సొరంగం శ్రీనగర్-లేహ్ హైవేపై నిర్మించారు. అత్యంత శీతలమైన లడఖ్‌ను అన్ని సీజన్లలో సందర్శించేందుకు ఉపయోగపడనుంది. ఈ సొరంగం రవాణా వ్యవస్థతో పాటు రక్షణ వ్యవస్థకు కూడా కీలకంగా మారనుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి టన్నెల్ ద్వారా వెళ్లొచ్చు.


"కార్గిల్" ఇక మరింత సురక్షితం

జమ్మూకశ్మీర్‌లో ‘జడ్‌ మోడ్‌’ టన్నెల్‌ ఏర్పాటుతో కార్గిల్ మరింత సురక్షితంగా మారింది. గతంలో కార్గిల్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడగా.. భారత్ ఏకంగా యుద్ధం చేసింది. శీతాకాలంలో తీవ్రంగా మంచు కురిసే సమయాన్ని ఆసరా చేసుకుని ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడులకు తెగబడ్డారు. కార్గిల్ ఉగ్రవాదుల హస్తగతమైతే.. శ్రీనగర్–లేహ్ మధ్య రాకపోకలు నిలిచేవి. ఈ సొరంగం ద్వారా సైన్యం కార్గిల్ కు వేగంగా వెళ్లొచ్చు.

భారీ భద్రత ఏర్పాటు

టన్నెల్ ఓపెనింగ్ కు ప్రధాని మోదీ రానుండడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. న్ని ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని సైతం భారీగా మోహరించారు. పలు జిల్లాల్లోని ముఖ్యమైన కూడళ్లలో చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ జరుగుతున్న కారణంగా ద్విచక్ర వాహనాలతో పాటు ప్రజలు, ఇతర వాహనాల తనిఖీలను ముమ్మరం కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రోన్‌లతో సహా వైమానిక, సాంకేతిక నిఘా పెట్టినట్లు చెప్పారు. 

Tags:    

Similar News