Vikram 3201: ‘విక్రమ్ 3201’? భారత్లో తొలి స్వదేశీ మైక్రోచిప్...
గేమ్ ఛేంజర్ తొలి మేడిన్ ఇండియా చిప్ విశేషాలివే
సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'విక్రమ్ 3201' అనే 32-బిట్ మైక్రోప్రాసెసర్ను మంగళవారం ఆవిష్కరించింది. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
ఢిల్లీలో జరిగిన సెమీకండక్టర్ పరిశ్రమల సమావేశంలో ఈ చిప్ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని, ఈ మైక్రోచిప్లను 'డిజిటల్ డైమండ్స్'గా అభివర్ణిస్తూ, భవిష్యత్ ప్రపంచం చిప్ల ఆధారంగానే నడుస్తుందని స్పష్టం చేశారు.
'విక్రమ్ 3201' ప్రాసెసర్ను ప్రత్యేకంగా అంతరిక్ష ప్రయోగాల కోసం రూపొందించారు. ఇది అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణాన్ని, అంటే తీవ్రమైన ఉష్ణోగ్రతలను (-55°C నుంచి +125°C వరకు), అధిక రేడియేషన్ను సైతం తట్టుకోగలదు. అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాల్లో అత్యంత విశ్వసనీయమైన 'ఆడా' ప్రోగ్రామింగ్ భాషకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇదివరకే ఉన్న 16-బిట్ 'విక్రమ్ 1601' చిప్కు ఇది అధునాతన వెర్షన్.
పంజాబ్లోని మొహాలీలో ఉన్న సెమీకండక్టర్ లాబొరేటరీ (SCL)లో 180 నానోమీటర్ల టెక్నాలజీతో ఈ చిప్ను తయారు చేశారు. ఇప్పటికే పీఎస్ఎల్వీ-సీ60 మిషన్లో దీనిని విజయవంతంగా పరీక్షించడం ద్వారా దీని పనితీరును నిర్ధారించారు. ఈ చిప్తో పాటు అవసరమైన సాఫ్ట్వేర్ టూల్స్ను కూడా ఇస్రోనే అభివృద్ధి చేయడం విశేషం. దీనివల్ల విదేశీ ఎలక్ట్రానిక్స్పై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది.
ఈ మైక్రోప్రాసెసర్ కేవలం అంతరిక్ష ప్రయోగాలకే పరిమితం కాదు. రక్షణ, ఏరోస్పేస్, ఆటోమోటివ్ వంటి కీలక రంగాల్లో కూడా దీనిని వినియోగించుకోవచ్చు. ఈ ఆవిష్కరణతో భారత్ సెమీకండక్టర్ల తయారీలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని, తైవాన్, అమెరికా వంటి దేశాలతో పోటీ పడుతూ ప్రపంచంలోనే సెమీకండక్టర్ హబ్గా ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.