PM Modi on Wayanad: వయనాడ్లో నేడు ప్రధాని మోడీ పర్యటన
కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే..
కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తుతో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా.. మరో 200 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (శనివారం) వయనాడ్లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా సహాయ, పునరావాస చర్యలను సమీక్షించనున్నారు మోడీ.. నేటి ఉదయం 11 గంటలకు కన్నూర్ కు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేస్తారని అధికారులు తెలిపారు.
అలాగే, మధ్యాహ్నం 12:15 గంటలకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మోడీ పరిశీలిస్తారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రెస్క్యూ ఫోర్స్ సహాయక చర్యలు గురించి వివరించనున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పునరావాస పనులను దగ్గరుండి మరీ ప్రధాని పర్యవేక్షిస్తారు. అలాగే, బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలు, ఆసుపత్రిని కూడా సందర్శించనున్నారు. అక్కడ కొండచరియలు విరిగిపడిన బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ పరామర్శిస్తారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. కొనసాగుతున్న సహాయక చర్యలు, ప్రస్తుత పరిస్థితుల గురించి అధికారులను ప్రధాని మోడీ అడిగి తెలుసుకోనున్నారు.