Murmu : మహిళల రక్షణపై బలమైన నిర్ణయం తీసుకోవాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మన దేశంలో మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పుడూ ధైర్యం, శక్తి ప్రదర్శిస్తూ ముందడుగు వేస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆడవారి భద్రతకు సంబంధించి కఠినచట్టాలున్నాయి. కానీ, దురదృష్టవశాత్తు అభద్రతా భావం ఇంకా వెంటాడుతోందన్నారు.సోమవారం సీఎన్ఎన్-న్యూస్18 షీశక్తి 2024 కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘‘ మహిళల సాధికారతపైనే దేశబలం ఆధారపడి ఉంటుంది. మన దేశంలో మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పుడూ ధైర్యం, శక్తి ప్రదర్శిస్తూ ముందడుగు వేస్తున్నారు. సంప్రదాయాలు, సామాజిక అసమానతలతో మహిళలు పోరాడుతునే ఉన్నారు. ఏళ్ల తరబడి నాటుకు పోయిన సామాజిక భావనలు మహిళా సమానతకు అడ్డంకిగా మారుతున్నాయి. మార్పులు జరిగినా ఆ అసమానతలు పోవట్లేదు. మనమంతా ఆత్మపరిశీలన చేసుకొని .. పరిస్థితి మెరుగుపడటానికి ఏంచేయాలని ప్రశ్నించుకోవాల్సిన అవసరముంది. దేశప్రగతికి కీలకమే మహిళా భద్రత, గౌరవం. మహిళల మర్యాదను కాపాడేందుకు, రక్షణ కల్పించేందుకు మనమందరం బలమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.