Modi: సుడిగాలి పర్యటన..
ఈనెల 7, 8వ తేదీల్లో తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, యూపీ, రాజస్తాన్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.;
ప్రధాని మోదీ నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు.ఈనెల 7, 8వ తేదీల్లో తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, యూపీ, రాజస్తాన్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 50 వేల కోట్ల విలువైన 50 ప్రాజెక్టులు,అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం,శంకుస్థాపనలు చేయనున్నారు.తొలుత ఈనెల 7న ప్రధాని మోదీ ఢిల్లీ నుండి రాయ్పూర్కు వెళ్తారు.అక్కడ పలు ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు.ఆ తర్వాత రాయ్పూర్- విశాఖపట్నం ఆరులైన్ల కారిడార్కు శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.అక్కడి నుంచి ప్రధాని గోరఖ్పూర్కు వెళ్తారు.అక్కడ గీతా ప్రెస్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.అలాగే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
గోరఖ్పూర్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసికి వెళ్తారు.అక్కడ పలు కీలక ప్రాజెక్టులు,అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు.పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, NH56 నాలుగు లేన్ల కారిడార్ను జాతికి అంకితం చేస్తారు.అలాగే మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.ఇక 8వ తేదీన వారణాసి నుంచి తెలంగాణ పర్యటనలో భాగంగా వరంగల్కు రానున్నారు. ఎన్హెచ్-563లో కరీంనగర్ వరంగల్ సెక్షన్ నాలుగు లైన్లకు శంకుస్థాపన చేస్తారు.ఆ తర్వాత వరంగల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.వరంగల్ సభ అనంతరం ప్రధాని మోదీ బికనీర్కు వెళ్తారు.అక్కడ బహుళ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.అమృత్సర్ జామ్నగర్ ఎక్స్ప్రెస్ వేలోని వివిధ విభాగాలు,గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-I కోసం ఇంటర్-స్టేట్ ట్రాన్స్మిషన్ లైన్ను ప్రధాని ప్రారంభిస్తారు.అలాగే బికనీర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం బికనీర్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. యూపీ మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటన కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.