Ashwini Vaishnaw: రైల్వే టికెట్ కౌంటర్లో కొన్నా..ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు!
భారతీయ రైల్వే సరికొత్త సదుపాయం;
ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తూ భారతీయ రైల్వే సరికొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రయాణికులు టికెట్లను రైల్వే కౌంటర్లో కొనుగోలు చేసినా ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
‘కౌంటర్ ద్వారా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కొన్న ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేయించుకోవడానికి రైలు బయలుదేరక ముందే స్టేషన్ను సందర్శించాల్సి ఉంటుందా?’అని బీజేపీ ఎంపీ మేధా విశ్రం కుల్కర్ణి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ప్రయాణికులు ఇకపై తమ టికెట్లను రద్దు చేసుకోవడానికి స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రయాణికులు రైలు టికెట్లను కౌంటర్లో కొన్నా దానిని ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకోవచ్చని తెలిపారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లేదా 139కి ఫోన్ చేసి టికెట్ రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే క్యాన్సిల్ డబ్బులు వసూలు చేసుకోడానికి రిజర్వేషన్ సెంటర్ను సందర్శించాల్సి ఉంటుందని తెలిపారు.