Karni Sena: రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడి హత్య
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే ?;
రాజస్థాన్లో అతివాద సంస్థ రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు గురయ్యారు. జయపురాలోని శ్యామ్నగర్లో.. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటిలోకి చొరబడి మరీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుఖ్దేవ్ చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని గోల్డీ బ్రార్స్ ముఠా ప్రకటించింది.
రాజస్థాన్ జయపురలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి మరణించారు. శ్యామ్నగర్లోని సుఖ్ దేవ్ సింగ్ ఇంట్లోకి నలుగురు దుండగులు ప్రవేశించి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన భద్రతా సిబ్బంది మరొకరు గాయపడ్డారు. తీవ్ర గాయాలైన సుఖ్ దేవ్ సింగ్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మరణించారని జైపుర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ తెలిపారు. బైక్ పై దుండగులు సుఖ్ దేవ్ సింగ్ ఇంటికి వచ్చారని పేర్కొన్నారు.సుఖ్దేవ్పై కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ పై కాల్పుల సమాచారం తెలుసుకుని ఆయన అభిమానులు... శ్యామ్ నగర్ కు భారీగా తరలివచ్చారు. సుఖ్ దేవ్కు మద్దతుగా నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండడం వల్ల పోలీసులు ఈ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
రాజ్ పుత్ కర్ణిసేన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. బాలీవుడ్ లో..కొన్నాళ్ల క్రితం వచ్చిన పద్మావత్ విడుదల విషయంలో అడ్డంకులు సృష్టించింది. సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మేకర్స్ ను హెచ్చరించింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'పృథ్వీరాజ్ కు..కర్ణిసేన నిరసన సెగ తగిలింది. జయపుర వద్ద షూటింగ్ జరుగుతుండగా... కర్ణిసేన అడ్డుకుంది. కర్ణిసేనతో మాట్లాడిన చిత్ర దర్శకుడు చంద్రప్రకాశ్, పృథ్వీరాజ్ చరిత్రలో మార్పులేమీ చేయకుండానే... సినిమా తీస్తున్నానని చెప్పారు. కానీ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని దీనికి అంగీకరిస్తేనే షూటింగ్ జరుగుతుందని తెలిపింది.