Modi-Putin: భారత్-అమెరికా డీల్పై స్పందించిన రష్యా
భారత్కు ఆ స్వేచ్ఛ ఉందని వెల్లడి
భారత్-అమెరికా మధ్య ఇటీవల కీలక వాణిజ్య ఒప్పందం జరిగింది. భారత్పై విధించిన 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా రష్యా దగ్గర కొనుగోలు నిలిపివేస్తు్న్నట్లు భారత్ తెలియజేసిందని చెప్పుకొచ్చారు.
తాజాగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రష్యా స్పందించింది. భారత్ ఎవరి నుంచైనా.. ఎక్కడ్నుంచైనా చమురు కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది. భారత్కు మాస్కో మాత్రమే ముడి సరఫరాదారు కాదని పేర్కొన్నారు.
‘‘భారతదేశానికి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసేది రష్యా మాత్రమే కాదని మాకు.. ఇతర అంతర్జాతీయ ఇంధన నిపుణులందరికీ బాగా తెలుసు. భారతదేశం ఎల్లప్పుడూ ఇతర దేశాల నుంచి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. అందువల్ల ఇందులో మాకు కొత్తగా ఏమీ కనిపించడం లేదు.’’ అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొ్న్నారు. వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయడానికి బహుశా ప్రధాని మోడీ అంగీకరించి ఉండి ఉంటారని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు భారతదేశం నుంచి రష్యాకు ఎటువంటి సందేశాలు రాలేదని పెస్కోవ్ తెలిపారు.
‘‘రష్యా హైడ్రోకార్బన్లను భారతదేశం కొనుగోలు చేయడం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని.. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని మేము నమ్ముతున్నాము. భారతదేశంలోని మా భాగస్వాములతో ఈ రంగంలో సన్నిహిత సహకారాన్ని కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా విలేకరుల సమావేశంలో అన్నారు.