SHABARI: నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం

భారీగా శబరిమలకు చేరుకున్న భక్తులు.. సాయంత్రం 6 నుంచి 7 మధ్య జ్యోతి దర్శనం;

Update: 2025-01-14 05:30 GMT

శబరిమల అయ్యప్ప సన్నిధానంలో నేడు మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. మకరజ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సాయంత్రం 6-7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఇవ్వనుంది. మకరజ్యోతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ, సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం.

ఆభరణాల ఊరేగింపునకు సర్వం సిద్ధం

మకర సంక్రాంతి పర్వదినానికి శబరిమల సిద్ధమైంది. 'తంకా అంకి' ఊరేగింపు అయ్యప్ప భక్తులకు చాలా ముఖ్యమైంది. అయ్యప్ప విగ్రహానికి అలంకరించే పవిత్ర బంగారు ఆభరణాలే తంకా అంకి. 1970వ దశకంలో 453 సవర్ల బరువున్న బంగారు ఆభరణాలను ట్రావెన్‌ కోర్ సంస్థానం అయ్యప్పకు సమర్పించింది. మండలం, మకరవిళక్కు సమయంలో శబరిమల అయ్యప్ప సన్నిధానానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ సమయంలో గరుడ పక్షి ఆభరణాలను అనుసరిస్తూ శబరిమలకు వస్తుంది.

మకర జ్యోతి ప్రాశస్త్యం తెలుసా..?

అయ్యప్పస్వామి మొదటి అవతారాన్ని మణికంఠుడు అంటారు. ఈ అవతారంలో 18 మెట్లు ఎక్కిన తర్వాత అయ్యప్ప జ్యోతి రూపంలో అంతర్దానం అయిపోయాడని చెబుతారు. ఆ తర్వాత అవతారాన్ని అయ్యనార్ అని అంటారు. అయ్యనార్ అందరూ చూస్తుండగానే అయ్యప్ప జ్యోతి రూపంలో మారిపోయాడట. ఆ రోజు మకర సంక్రాంతి కావడంతో ఏటా మకర సంక్రాంతి రోజు అయ్యప్ప జ్యోతి రూపంలో వస్తాడని భక్తుల విశ్వాసం. దానినే మకర జ్యోతిగా ఆరాధిస్తున్నారు.

Tags:    

Similar News