Hajj flight : హజ్ యాత్రికుల విమానంలో మంటలు..

సురక్షితంగా బయటపడ్డ 250 మంది యాత్రికులు;

Update: 2025-06-16 04:45 GMT

హజ్ యాత్రికులతో ఉన్న విమాన చక్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ, నిప్పురవ్వలు రావడంతో పైలట్ అప్రమత్తమై లక్నో ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానంలో ఉన్న 250 మంది హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. హైడ్రాలిక్ లీక్ కారణంగా చక్రంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SV 3112 విమానం శనివారం రాత్రి 10.45 గంటలకు జెడ్డా నుంచి 250 మంది హజ్ యాత్రికులతో లక్నోకు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ గుర్తించాడు. పైలట్ వెంటనే విమానాన్ని ఆపి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం విమానాన్ని వెనక్కి నెట్టి టాక్సీవేకు తరలించారు. అక్కడ ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించేశారు.

ఇక విమానాశ్రయ అత్యవసర బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. నురుగు మరియు నీటిని ఉపయోగించి 20 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అకస్మాత్తుగా హైడ్రాలిక్ లీక్ కావడం వల్లే వీల్ చక్రం హీటెక్కినట్లుగా గుర్తించారు. టేకాఫ్ సమయంలో ఈ సమస్య జరిగి ఉంటే తీవ్రమైన ప్రమాదానికి దారితీసి ఉండేదని అధికారులు తెలిపారు. జెడ్డా నుంచి హజ్ యాత్రికులను తీసుకువచ్చిన ఈ విమానం సౌదీ అరేబియాకు తిరిగి ఖాళీగా వెళ్లాల్సి వచ్చింది.

ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రయాణికులు చనిపోయారు. అలాగే హాస్టల్ మీద కూలడంతో 34 మంది మెడికోలు కూడా చనిపోయారు. చికిత్స పొందుతున్న వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరుగుతుంది.

Tags:    

Similar News