Mani Shankar Aiyar: 1962లో భారత్‌పై చైనా దాడి ఆరోపణలే

మణిశంకర్‌ అయ్యర్‌ మరో దుమారం;

Update: 2024-05-29 23:15 GMT

 లోక్‌సభ ఎన్నికల వేళ...... సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు హస్తం పార్టీకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని గౌరవించాలని కాంగ్రెస్‌ సీనియర్ నేత మణిశంకర్‌ అయ్యర్‌ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తాజాగా ఆయన మరో వివాదానికి తెరలేపారు. 1962లో భారత్‌పై చైనా దాడి చేయలేదని.. కేవలం ఆరోపణలే ఉన్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1962లో భారత్‌పై చైనా దాడిని ఆరోపణగా అభివర్ణించారు. దిల్లీలో మంగళవారం సాయంత్రం నెహ్రూస్‌ ఫస్ట్‌ రిక్రూట్స్‌ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హజరైన మణిశంకర్‌ అయ్యర్‌... 1962 నాటి భారత్‌-చైనా యుద్ధం గురించి ప్రస్తావించారు. నాడు భారత్‌పై చైనా బలగాలు దాడులు చేశాయనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. అయితే, వాస్తవంగా జరిగిన దాడిని అయ్యర్‌ ఆరోపణ అని పేర్కొనడం దుమారం రేపింది.

మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు వచ్చే శాశ్వత స్థానాన్ని... నాడు నెహ్రూ చైనా కోసం వదిలేశారని తీవ్రస్థాయిలో విమర్శించింది. భారత్‌ పరిశ్రమలను దెబ్బకొట్టి యూపీఏ హయాంలో చైనా ఉత్పత్తులకు మార్కెట్‌ అవకాశాలు కల్పించారని దుయ్యబట్టింది. ఇప్పుడేమో ఆ పార్టీ.. 38వేల చదరపు కిలోమీటర్ల భారత్‌ భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న నాటి చైనా దండయాత్రను ఆరోపణ అంటున్నారని భాజపా నేత అమిత్‌ మాలవీయ ఆక్షేపించారు. 1962లో భారత్‌పై చైనా దాడిని చరిత్ర నుంచి తుడిచేయాలని అనుకుంటున్నారా అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. 

మణిశంకర్‌ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్‌ వివరణ ఇచ్చింది. చైనా దాడికి మణిశంకర్‌ పొరబాటుగా ఆరోపణ అనే పదాన్ని ఉపయోగించారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ తెలిపారు.ఇందుకు మణిశంకర్‌ వెంటనే క్షమాపణలు తెలియజేశారని గుర్తుచేశారు. 1962లో భారత్‌పై చైనా జరిపిన దాడి వాస్తవమేనని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు

Tags:    

Similar News