ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు హైకోర్టులో సోమవారం భారీ ఊరట లభించింది. దివ్యాంగులను కించపరిచేలా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేశారని ఆమెపై చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈక్రమంలో ఈ పిటిషన్ కు విచారణ అర్హతలేదని హైకోర్టు కొట్టివేసింది.
ఆలిండియా సర్వీసుల్లో (ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్) వికలాంగుల కోటా అవసరమా అంటూ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ ఇటీవల దుమారం రేపాయి. వికలాంగులపై స్మితా సబర్వాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. అత్యున్నత పదవిలో ఉండి స్మితా సబర్వాల్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదంటూ పలువురు రాజకీయ నేతలు, మేధావులు సైతం ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. చివరకు స్మితా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు స్మితా సబర్వాల్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు పిటిషన్ ను కొట్టివేయడంతో దివ్యాంగులపై చేసిన వాఖ్యాల విషయంలో స్మితా సబర్వాల్ కు భారీ ఊరట దక్కినట్టయింది.