Vande Bharat Express : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి

ఒడిశాలో ఘటన

Update: 2023-11-27 05:15 GMT

దేశంలో మరోసారి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. తాజాగా ఒడిశాలో రూర్కెలా-భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కిటికీ అద్దాలు  దెబ్బతిన్నాయి. ఆదివారం ఒడిశాలో రూర్కెలా-భువనేశ్వర్ (20835) రైలును లక్ష్యంగా చేసుకుని దుండగులు రాళ్ల దాడి చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని దెంకనల్-అంగుల్ రైల్వే సెక్షన్‌లో మెరమండలి మరియు బుధపాంక్ మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో రైలు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌ కిటికీలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ ఎస్కార్టింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతా విభాగం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ప్రభుత్వ రైల్వే పోలీసులను అప్రమత్తం చేసింది. కటక్ నుంచి ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ ఘటనపై స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రైలుపై రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపింది. స్థానిక పోలీసుల సమన్వయంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతా విభాగం నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయని వెల్లడించింది.

Tags:    

Similar News