Vandebharat : ఛత్తీస్గఢ్లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..
ఐదుగురు అరెస్ట్;
ఛత్తీస్గఢ్లోని మహాసముంద్లోని బాగ్బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై ట్రయల్ రన్ సందర్భంగా రాళ్లదాడి కేసు వెలుగులోకి వచ్చింది. రాళ్లు రువ్వడంతో రైలు మూడు కోచ్ల అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల్లో ఒకరి సోదరుడు కౌన్సిలర్.
దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 54 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. అయితే, ఈ రైళ్లపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వుతున్న ఘటనలు ఇప్పటికే అనేకం వెలుగు చూశాయి. తాజాగా మరో రైలుపై రాళ్ల దాడి జరిగింది.
కేంద్రం 10 వందే భారత్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు (Days Before Flagging Off). దీనికి సంబంధించిన ఏర్పాట్లను రైల్వే అధికారులు చకచకా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్స్ను కూడా పూర్తి చేశారు. అయితే, విశాఖపట్నం – దుర్గ్ (Visakhapatnam – Durg) మధ్య నడిచే రైలుకు ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు దాడి చేశారు. శుక్రవారం ఉదయం బగ్బహరా రైల్వే స్టేషన్ సమీపంలో ట్రయల్ రన్స్లో భాగంగా పట్టాలపై పరుగులు పెడుతన్న సమయంలో దానిపై రాళ్లు రువ్వారు.
ఈ ఘటనలో రైలుకు సంబంధించిన మూడు కోచ్ల అద్ధాలు ధ్వంసమయ్యాయి. సీ2-10, సీ4-1, సీ9-78 అద్ధాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనను రైల్వే అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి.. నిందితులు బగ్బహారాకు చెందిన శివకుమార్ బఘెల్, దేవేంద్ర కుమార్, జీతు పాండే, సోన్వానీ, అర్జున్ యాదవ్లుగా గుర్తించారు. ఐదుగురిపై రైల్వే చట్టం 1989 కింద కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.