Eknath Shinde: ఇంకా చేసేది చాలా ఉందన్న ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు
మిలింద్ దేవరా చేరికపై కీలక వ్యాఖ్యలు;
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవర ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీనిపై ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ, అసలు సినిమా ముందుందంటూ లోక్సభ ఎన్నికలకు ముందు మరిన్ని చేరికలు ఉండబోతున్నాయనే సంకేతాలిచ్చారు.
ఏడాదిన్నర క్రితం తాను ఒక ఆపరేషన్ చేశానని, కుట్లు కూడా వేయకుండా ఆపరేషన్ జరిపానని ఆయన అప్పట్లో శివసేన నుంచి బయటకు వచ్చి 30కి పైగా ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతిచ్చిన ఘట్టాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నారు. ''నేను డాక్టర్ను కాను. అయినా ఏడాదిన్నర క్రితం ఒక ఆపరేషన్ చేశాను. కుట్లు వేయకుండానే ఆపరేషన్ జరిగింది. అంతకంటే ఏమీ చెప్పలేను. ఇది ట్రయిలర్ మాత్రమే, ఫిల్మ్ ఇంకా రావాల్సి ఉంది'' అని సీఎం నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈరోజు మిలింద్ ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారో ఏడాదిన్నర క్రితం తను కూడా అలాగే భావించానని, అప్పటి సీఎం ఉద్ధవ్ థాకరేతో తెగతెంపులు చేసుకున్నానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దేవరాకు షిండే కాషాయ జెండాను అందచేశారు. తాను కాంగ్రెస్ను వీడతానని ఎన్నడూ అనుకోలేదని, ఆ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న 55 ఏండ్ల అనుబంధం నేటితో తెగిపోయిందని అంటూ మిలింద్ దేవరా భావోద్వేగానికి లోనయ్యారు. ఏక్నాథ్ షిండే నాయకత్వంలో తాను శివసేన గూటికి చేరుతున్నానని చెప్పారు.షిండే అందరికీ అందుబాటులో ఉండే నేతని, దేశానికి మోదీ, అమిత్ షా దార్శనికత ఎంతో అవసరమని, అందుకే తాను వారితో కలిసి పనిచేయాలని కోరుకున్నానని అన్నారు. కాగా, మిలింద్ దేవరా తమ పార్టీలో చేరితే స్వాగతిస్తానని అంతకుముందు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత, దక్షిణ ముంబై మాజీ ఎంపీ మిలింద్ దేవరా ఆదివారం ఉదయం ప్రకటించారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన మధ్య లోక్సభ సీట్ల సర్ధుబాటు చర్చల పట్ల అసంతృప్తితో మిలింద్ దేవరా కాంగ్రెస్ను వీడారని చెబుతున్నారు.
కాగా, ప్రస్తుత రాజకీయాలు అధికారం చుట్టూ తిరుగుతున్నాయని, సిద్ధాంతం, విలువలు, విశ్వాసానికి చోటు లేదని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. మిలింద్ తండ్రి మురళి దియోర దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని, అధికార దాహంతోనే మిలింద్ దియోర శివసేన షిండే వర్గంలో చేరుతున్నారని దుయ్యబట్టారు.