PM Modi: త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్ మీటింగ్
సీడీఎస్ అనిల్ చౌహాన్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా;
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులతోపాటు సీడీఎస్ అనిల్ చౌహాన్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో మోదీ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. కాల్పుల విరమణ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, సరిహద్దుల వద్ద తాజా పరిస్థితిపై వారు చర్చిస్తున్నారు. అంతేకాదు సోమవారం పాక్తో జరగనున్న చర్చల అంశంపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు.
భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు (ceasefire) పాకిస్థాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ అంగీకరించింది. పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. తదుపరి కార్యాచరణ కోసం రెండు దేశాల డీజీఎంవోలు ఈ నెల 12న మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు.