Mamata Banerjee: నేడు సందేశ్ఖాలీలో పర్యటించనున్న సీఎం మమతా బెనర్జీ
పౌరసరఫరాల శాఖ కార్యక్రమంలో పాల్గొననున్న బెంగాల్ సీఎం..;
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళల ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన సందేశ్ఖాలీలో ఈరోజు (డిసెంబర్30) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటించనున్నారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతల భూకబ్జాలు, లైంగిక వేధింపులపై ఈ ఏడాది ఆరంభంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల తర్వాత ఈ ప్రాంతంలో సీఎం మమత బెనర్జీ పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక, పౌర సరఫరాల శాఖ కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.
ఇక, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందేశ్ ఖాలీలో పర్యటన చేస్తుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రతలు చేపట్టారు. మాజీ టీఎంసీ నేత షేక్ షాజహాన్ తమ భూములు కబ్జా చేయడంతో పాటు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని సందేశ్ఖాలీలో మహిళలు ఉద్యమం చేశారు. ఆ తర్వాత రేషన్ స్కామ్లో మనీ లాండరింగ్ ఆరోపణల్లో షేక్ షాజహాన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. ఈ పరిణామాలతో అప్పట్లో అతడిని టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది.