Uttar Pradesh: బిడ్డ కోసం తోడేలు తో తల్లి పోరాటం.. తోక ముడిచిన తోడేలు

50 రోజుల్లో 9 మంది ప్రాణాలు తీసిన తోడేళ్లు;

Update: 2024-09-03 01:45 GMT

ఉత్తరప్రదేశ్‌లో తోడేళ్లు మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి. బహ్రెయిచ్ జిల్లాలో తోడేళ్ల గుంపు గ్రామాల్లోకి చొరబడి... దాడులు చేస్తుండటంతో జనం వణికిపోతున్నారు. మూడు నెలల్లో తోడేళ్ల దాడుల్లో 9 మంది చనిపోగా.. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రూర జంతువులు చిన్నారులనే టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మహిళ..తోడేళ్లతో వీరోచిత పోరాటం చేసి తన బిడ్డను రక్షించించుకుంది. మృత్యువుకు ఎదురొడ్డి పోరాడిన ఆ తల్లి ధైర్యసాహసాల ముందు ఆ తోడేలు తోక ముడవక తప్పలేదు. బిడ్డకు తల్లి రక్షణ కవచంగా నిలిచి.. వారి ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డువేస్తుందనడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ.

ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్‌ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోన్న నేపథ్యంలో.. ఓ తల్లి వీరోచితంగా పోరాడి తన కుమారుడిని కాపాడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మృత్యువుకు ఎదురు నిలిచి పోరాడిన ఆ తల్లి ధైర్యసాహసాల ముందు ఆ తోడేలు తోక ముడవక తప్పలేదు. హర్ది ప్రాంతంలో ఐదేళ్ల పరాస్‌ తన తల్లి గుడియా పక్కన నిద్రిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వింత శబ్దం విని ఆ తల్లి ఒక్కసారిగా మేల్కొంది. కళ్లు తెరిచి చూసే సరికి తన కుమారుడి మెడ పట్టుకుని తోడేలు లాక్కెళ్తోంది. దీంతో ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. మంచంపై నుంచి దూకి తోడేలు వైపు దూసుకెళ్లింది. భయపడకుండా.. ఆ జంతువు మెడ చుట్టూ రెండు చేతులు గట్టిగా బిగించింది. వెంటనే ఇతరుల సహాయం కోసం కేకలు వేసింది. దీంతో తోడేలు ఆ చిన్నారిని వదిలి అక్కడి నుంచి పరారైంది. తోడేలు దాడిలో గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ప్రాణాలకు తెగించి బిడ్డను రక్షించుకున్న ఆ మాతృమూర్తి ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. అంతకు ముందే తోడేలు దాడిలో అంజలి అనే ఓ రెండేళ్ల చిన్నారి సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. అమ్మ పక్కనే నిద్రపోతున్న ఆ చిన్నారిని తోడేలు ఎత్తుకెళ్లింది. ఈ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది చుట్టుపక్కల గాలించారు. కానీ, దాని జాడ దొరకలేదు. తోడేళ్లను పట్టుకోడానికి యూపీ ఆపరేషన్ భేడియాను చేపట్టారు.

Tags:    

Similar News