Fire In Metro Station: మెట్రో స్టేషన్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
వెల్డింగ్ చేస్తుండగా మంటలు?;
పూణెలోని మండై మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు రాత్రి 12 గంటల సమయంలో మండై మెట్రో స్టేషన్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్లో మంటలు చెలరేగాయి. దాంతో అక్కడి ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. ఇది గమనించిన మెట్రో అధికారులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. దాంతో ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని ఐదు నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో నీటిని చల్లి మంటలను ఆర్పారు . ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయని చెప్పారు. కాగా, మెట్రో స్టేషన్లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ట్వీట్ చేశారు.