ప్రతిపక్షాలపై దౌర్జన్యం చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే తన అసమర్ధతగా వైకాపా అధిష్టానం భావించి ఉండొచ్చని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అర్హత లేదని తనకు మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదన్నారు. బీసీలకు వైకాపాలో అగ్ర తాంబూలం అనేది నేతి బీర కాయలో నెయ్యి తరహానేనని విమర్శించారు. బలహీన వర్గాలకు వైసీపీలో గుర్తింపు ఉంటుందని గతంలో తానూ చెప్పిన వాడినేనన్న పార్థసారథి...అది తప్పని తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదన్నారు. గన్నవరంలో వైకాపా గెలిచే పరిస్థితి లేదన్న ఆయన...ఆ స్థానానికి తనను పంపాలని జగన్ చూశారని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీలో పార్థసారథి చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు ఆయనతో చర్చించారు. వారు టీడీపీలోకి ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా.. కదలి రా’ బహిరంగ సభ జరగనుంది. ఆ వేదిక మీదే పార్థసారథి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.