వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ముంపు బాధితులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ. 6 కోట్ల సాయం ప్రకటించారు. ఇందులో రూ. కోటి చెక్కును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంద జేశారు. విజయవాడ కలెక్టరేట్లో చంద్రబాబును కలిసిన పవన్... పలు అంశాలపై చర్చలు జరిపారు. సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈక్రమంలో పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పవన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వరద బాధితుల సహాయార్థం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఇటీవల భారీ విరాళం ప్రకటించారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోని 400 పంచాయతీలకు ఒక్కోదానికి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తానన్నారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.కోటి ఇస్తానని వెల్లడించారు.