CWC2023: "కంగారు" పెట్టించిన న్యూజిలాండ్
ఉత్కంఠభరిత మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుపు;
ప్రపంచకప్లో వరుసగా రెండో మ్యాచ్ కూడా క్రికెట్ ప్రేమికులను మునివేళ్లపై నిలబెట్టింది. ధర్మశాల వేదికగా జరిగిన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది. 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి బాల్ వరకు పోరాడి కేవలం 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్లో.... ఆస్ట్రేలియా నిర్దేశించిన 389 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కివీస్ చివరి బంతి వరకూ పోరాడింది. భారీ లక్ష్యాన్ని చూసి ఏమాత్రం వెరవని న్యూజిలాండ్.. తమ జట్టు ఎందుకు ప్రత్యేకమో ఈ పోరాటంతో మరోసారి నిరూపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయింది. 389 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు దిగిన కంగారులకు అదిరే ఆరంభం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (109: 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీ సాధించాడు. కేవలం 59 బంతుల్లోనే శతకం బాది ప్రపంచకప్లో వేగవంతమైన సెంచరీ చేసిన ఓపెనర్గా రికార్డు సృష్టించాడు. డేవిడ్ వార్నర్ (81: 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లు) మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 175 పరుగులు జోడించారు. చివర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ (41: 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (37: 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుగా ఆడారు. ఇంగ్లిస్ (38), మిచెల్ మార్ష్ (36) ఫర్వాలేదనిపించారు. ఓ దశలో తేలిగ్గా నాలుగు వందలు పరుగులు చేసేలా కనిపించిన ఆస్ట్రేలియా 388 పరుగులకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్ 3, గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీశారు.
389 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్... అద్భుత పోరాటంతో లక్ష్యాన్ని ఛేదించినంత పని చేసి కంగారులకు చెమటలు పట్టించింది. డేవిడ్ కాన్వే-విల్ యంగ్ జోడి తొలి వికెట్కు 7 ఓవర్లలోనే 61 పరుగులు చేసి శుభారంభం అందించారు. 28 పరుగులు చేసిన కాన్వే, 32 పరుగులు చేసిన యంగ్ వెనుదిరగడంతో 72 పరుగులకు కివీస్ రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఈ ప్రపంచకప్లో మంచి ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీతో న్యూజిలాండ్ను లక్ష్యం దిశగా నడిపించాడు. 89 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో రచిన్ రవీంద్ర 116 పరుగులు చేసి అవుటయ్యాడు. డేరిల్ మిచెల్ కూడా 54 పరుగులతో రాణించాడు. నీషమ్ అద్భుత పోరాటంతో కంగారులను కంగారు పెట్టించాడు. 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేసిన నీషమ్ చివరి ఓవర్ వరకూ ఆస్ట్రేలియాను వణికించాడు. 388 పరుగులు చేసినా చివరి బంతి వరకూ కంగారులకు విజయంపై ధీమా లేకుండా పోయింది. చివరి ఓవర్లో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. ఈ ఓవర్లో నీషమ్ అవుట్ అవ్వడంతో న్యూజిలాండ్ ఆశలకు తెరపడింది. చివరి బంతికి విజయానికి ఆరు పరుగులు చేయాల్సి ఉండగా ఫెర్గ్యూసన్ ఎలాంటి అద్భుతం చేయలేకపోయాడు.