ఈనెల 19 నుంచి 23 వరకు భారత్ – బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ తొలి టెస్ట్కు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఈ నేపథ్యంలో భారత్ ఓ సరికొత్త రికార్డు
క్రియేట్ చేయనుంది. బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్ట్లో భారత్ విజయం సాధిస్తే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓటముల కంటే అత్యధిక విజయాలు నమోదు చేసిన టీమ్ గా రికార్డ్ నెలకొల్పనుంది. 1932లో టీమిండియా క్రికెట్ ఆడటం మొదలుపెట్టగా.. 1952లో అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్పై తొలి విజయం సాధించింది. ఆ చారిత్రాత్మక విజయానికి చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక అయింది. 92 ఏళ్ల తర్వాత ఈనెల ప్రారంభం కానున్న భారత్–బంగ్లా తొలి టెస్ట్ సిరీస్ సైతం అదే స్టేడియంలో జరగనుంది. 1988 వరకు భారత టీమ్ ఒక్క ఏడాది కూడా ఎక్కువ విజయాలతో ముగించలేదు. 2009లో టీమ్ఇండియా వందో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. అప్పుడు 432 మ్యాచ్లు ఆడినప్పటికీ వారి మ్యాచ్ గెలుపు శాతం మాత్రం 23.14 మాత్రమే. అంటే నాలుగింట్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని పరిస్థితి. ఈ తర్వాత 15 ఏళ్లలో భారత్ 147 మ్యాచ్లు ఆడి 78 మ్యాచ్ల్లో గెలిచి విజయశాతాన్ని 53.06కి పెంచుకుంది.
టీమిండియా ఇప్పటివరకు 579 మ్యాచ్లు ఆడింది. అందులో గెలుపోటములు సమానంగా ఉన్నాయి. 178 విజయాలు, 178 ఓటములతో కొనసాగుతున్న భారత్ 222 మ్యాచ్లను డ్రా చేసుకుంది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. బంగ్లాతో ఆడనున్న తొలి టెస్ట్లో భారత్ విజయం సాధిస్తే.. క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొంటుంది. అంతేకాదు.. అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన నాలుగో టీమ్ గా రికార్డ్ నెలకొల్పుతుంది. మరో ఐదు విజయాలు సాధిస్తే టెస్టు చరిత్రలో అత్యంత విజయవంతమైన 3వ క్రికెట్ టీమ్ గా నిలుస్తుంది. టెస్ట్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి టీమిండియాను 36 మంది కెప్టెన్లు నడిపించారు. మొదటి కెప్టెన్ సీకే నాయుడు నుంచి ప్రస్తుత కెప్టెన్ రోహిత్శర్మ వరకు ప్రతిఒక్కరూ టీమ్ ను నడిపించి విజయాలను అందించారు. ఈ 92 ఏళ్లలో 314 మంది క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్లు ఆడారు.