T20 WORLD CUP: పాక్ ఖేల్ ఖతం..టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్
గెలిచినా ఇంటి దారి పట్టిన దాయాది
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో ఉత్కంఠ భరితమైన పోరు ప్రేక్షకులను అలరించినా, చివరకు పాకిస్తాన్కు నిరాశే మిగిలింది. సెమీఫైనల్ ఆశలతో బరిలోకి దిగిన ఆ జట్టు, గెలుపు సాధించినప్పటికీ నెట్ రన్రేట్ లో వెనుకబడటంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. కీలక సమయంలో శ్రీలంకను నిర్దిష్ట స్కోరులోపే కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉండగా, అది సాధ్యం కాకపోవడంతో పాక్ కథ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఫర్హాన్ అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. అతడు 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఎండ్లో ఫఖర్ జమాన్ కూడా దూకుడుగా ఆడుతూ 42 బంతుల్లో 84 పరుగులు చేశాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్లతో పాక్ భారీ స్కోరు నమోదు చేసింది.
అయితే సెమీస్ చేరాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపే కట్టడి చేయాల్సిన క్లిష్ట సమీకరణ పాక్ ముందుంది. కానీ ఆ లక్ష్యాన్ని సాధించడంలో బౌలర్లు విఫలమయ్యారు. ఛేదనలో శ్రీలంక 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ శానక 31 బంతుల్లో 76 పరుగులు చేసి చివరివరకు అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే 37 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టును పోటీలో నిలబెట్టాడు. 16 ఓవర్లు ముగిసేసరికి లంక 150 పరుగుల మైలురాయిని దాటడంతో పాక్ సెమీస్ ఆశలు చల్లారిపోయాయి.పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండూ మూడు మ్యాచ్లలో మూడు పాయింట్లు సాధించినా, మెరుగైన నెట్ రన్రేట్ (1.390)తో కివీస్ సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. పాక్ రన్రేట్ (-0.123) తక్కువగా ఉండటం వల్లే వెనుదిరగాల్సి వచ్చింది. చివరికి గెలిచినా ప్రయోజనం లేకపోవడంతో పాకిస్తాన్ టోర్నీకి గుడ్బై చెప్పింది