టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అనంతరం టెస్టులకు గుడ్ బై చెప్పాలని హిట్ మ్యాన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే తన రిటైర్మెంట్ పై బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆసీస్ తో సిడ్నీ టెస్టులో ఓడితే.. ఆ వెంటనే తన మనసులోని మాటను వెల్లడించనున్నాడు. ఒకవేళ ఆ మ్యాచ్లో గెలిచి.. భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే చాన్స్ ఉంటే మాత్రం .. అప్పటికి వరకు సారథిగా కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్న రోహిత్.. స్వదేశంలో కివీస్ తో జరిగిన 3 టెస్టుల సిరీస్లో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్ లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు.
సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టు కోసం పరుగులు సాధించలేకపోతున్నారని సునీల్ గావస్కర్ వంటి మాజీ క్రికెటర్లు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్సీలో సైతం రోహిత్ తీసుకున్న నిర్ణయాలు జట్టుకు ప్రతికూలంగా మారుతున్నాయి. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలిటెస్టులో బుమ్రా నేతృత్వంలో విజయం సాధించిన టీమ్ఇండియా, రోహిత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టగానే తిరోగమనంలో పయనిస్తోంది. సిరీస్లో 1-2తో వెనకబడింది. ఆస్ట్రేలియాతో ఆడిన మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 31 పరుగులే చేశాడు. అదే సమయంలో బుమ్రా ఈ సిరీస్లో 30 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉండటం గమనార్హం.