T20 WORLD CUP: గ్రూప్ దశలో ఓ లెక్క.. నాకౌట్లో మరో లెక్క
టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య సెమీస్ ఫైట్... అంచనాలను మించి రాణిస్తోన్న బ్రిటీష్ జట్టు... గ్రూప్ దశలో తేలిపోయిన ఇంగ్లాండ్ జట్టు
కొన్నేళ్ల కిందట పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్ ప్రభంజనం సృష్టించింది. 2019 వన్డే ప్రపంచకప్ గెలిచి తమ కలను నెరవేర్చుకున్న ఆ జట్టు, 2022లో రెండోసారి టీ20 ప్రపంచకప్ను అందుకుంది. దూకుడు బ్యాటింగ్, లోతైన బ్యాటింగ్ లైనప్, బహుముఖ ఆల్రౌండర్లు, వేగవంతమైన పేస్ దళం—ఇవి ఆ జట్టు బలాలు. కానీ గత రెండేళ్లలో ఆ ప్రాభవం తగ్గింది. భారత్ పర్యటనలో జరిగిన అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-4తో పరాజయం పాలవడం పెద్ద దెబ్బగా మారింది. ఆ తర్వాత కెప్టెన్గా ఉన్న జోస్ బట్లర్ పదవి నుంచి తప్పుకోగా, యువ కెప్టెన్ హ్యరీ బ్రూక్ పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి జట్టులో మార్పు కనిపించింది. ఈ టోర్నీ ప్రారంభంలో మాత్రం ఇంగ్లాండ్ ప్రదర్శన ఆశించినంతగా లేకపోయింది. నేపాల్ వంటి పసికూన జట్టుపై కేవలం నాలుగు పరుగుల తేడాతో గట్టెక్కడం విమర్శలకు దారితీసింది. 180కి పైగా స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపాడుకోవడంలో ఇబ్బందులు పడింది. తర్వాత వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలవడంతో సెమీస్ అవకాశాలపై అనుమానాలు పెరిగాయి. కానీ సూపర్-8 దశ నుంచి ఇంగ్లాండ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది.
శ్రీలంకపై బౌలింగ్కు అనుకూలమైన పిచ్పై 146 పరుగులే చేసినా, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని 95 పరుగులకే కట్టడి చేసింది. ఆ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ కీలక ఇన్నింగ్స్తో జట్టును నిలబెట్టగా, విల్ జాక్స్ పార్ట్టైమ్ స్పిన్తో మ్యాచ్ను తారుమారు చేశాడు. పాకిస్థాన్తో మ్యాచ్లో 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పరిస్థితిలో కెప్టెన్ బ్రూక్ అద్భుత శతకంతో జట్టును గట్టెక్కించాడు. ఆ ఇన్నింగ్స్ అతని నాయకత్వ సామర్థ్యాన్ని కూడా చాటింది. న్యూజిలాండ్పై లక్ష్య ఛేదనలో విల్ జాక్స్ ఆల్రౌండ్ ప్రదర్శన, టామ్ బాంటన్ సహకారం ఇంగ్లాండ్ను గ్రూప్లో అగ్రస్థానానికి చేర్చాయి.
ఇంగ్లాండ్ ఈ దశకు చేరడంలో ప్రధాన కారణం సమష్టితత్వం. ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడకుండా ప్రతి మ్యాచ్లో కొత్త హీరో బయటకు వస్తున్నాడు. విల్ జాక్స్ ఈ టోర్నీలో బ్యాటుతో 190కి పైగా పరుగులు చేయడమే కాక, బౌలింగ్లో కీలక వికెట్లు తీశాడు. స్పిన్ విభాగంలో ఆదిల్ రషీద్, లియామ్ డాసన్లు స్థిరత్వం చూపుతున్నారు. రషీద్ ఇప్పటికే పది పైగా వికెట్లు సాధించి ప్రత్యర్థి మధ్యక్రమాన్ని దెబ్బతీశాడు. పేస్ దళంలో జోఫ్రా ఆర్చర్, శామ్ కరణ్ జట్టుకు బలంగా నిలుస్తున్నారు. కరన్ బ్యాటుతో కీలక పరుగులు చేయడమే కాక, ఒత్తిడి సమయంలో బౌలింగ్లోనూ మెరవడం ఇంగ్లాండ్కు పెద్ద ప్లస్. జోస్ బట్లర్, జాకబ్ బెతెల్ వంటి ఆటగాళ్లు పూర్తి ఫామ్లో లేకపోయినా, మ్యాచ్ను ఒక్కసారిగా మలుపుతిప్పే సామర్థ్యం వాళ్లకు ఉంది. ముఖ్యంగా సాల్ట్ దూకుడు భారత బౌలర్లకు సవాల్గా మారవచ్చు. వీరిలో చాలా మందికి భారత్లో ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్లో ఆడి భారత పిచ్ల స్వభావాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అందువల్ల సెమీఫైనల్ వేదికపై ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుసు.
సెమీస్ జరగబోయే వాంఖడే స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలమైనదే అయినప్పటికీ, స్పిన్నర్లకు కూడా సహకరించే అవకాశం ఉంది. ఆ దృష్ట్యా ఇంగ్లాండ్ స్పిన్ దళం భారత బ్యాటర్లను పరీక్షించవచ్చు. ముఖ్యంగా అడిల్ రషీద్ లాంటి అనుభవజ్ఞుడిని తక్కువ అంచనా వేయడం ప్రమాదకరం. మరోవైపు ఆర్చర్ వేగం, కరన్ వైవిధ్యం భారత టాప్ ఆర్డర్కు సవాల్గా నిలవొచ్చు. టోర్నీ ప్రారంభంలో సందేహాల మధ్య ఉన్న ఇంగ్లాండ్ ఇప్పుడు పూర్తి స్థాయి పోటీదారుగా మారింది. దూకుడు, సమష్టి ప్రదర్శన, బహుముఖ ఆటగాళ్ల సమాహారంతో సెమీఫైనల్కు చేరింది.