గంభీర్ స్వార్థపరుడంటూ కోల్కత నైట్ రైడర్స్ మాజీ ఆటగాడు మనోజ్ తివారీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై క్రికెటర్లు నితీశ్ రాణా, హర్షిత్ రాణా స్పందించారు. ఇద్దరూ తమ ఇన్స్టాలో గంభీర్కు మద్దతుగా పోస్ట్ చేశారు. ‘విమర్శలనేవి వ్యక్తిగత అభద్రత వల్ల కాక నిజానిజాల ఆధారంగా ఉండాలి. నేను కలిసినవారిలో అత్యంత నిస్వార్థపరుడు గౌతీ భయ్యా’ అని నితీశ్ పేర్కొనగా గంభీర్ ఆటగాళ్లకు అండగా నిలిచి వారిని వెలుగులోకి తెస్తారని హర్షిత్ పేర్కొన్నారు.
అంతకుముందు గంభీర్ మోసపూరిత వ్యక్తి అని, అతడు చెప్పినవాటినే పాటించడని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ విమర్శించారు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, మోర్నే మోర్కెల్ను ఏరికోరి తన టీమ్లోకి తెచ్చుకున్నారని, వారేం చేశారని ప్రశ్నించారు. కెప్టెన్ రోహిత్తో గంభీర్కు సమన్వయం లేదన్నారు. గతంలో కోల్కత నైట్ రైడర్స్ విజయాల కోసం తాను, కల్లిస్, నరైన్ తదితరులు ఎంతో కృషి చేసినా గౌతీ క్రెడిట్ తీసుకున్నాడని దుయ్యబట్టారు.
మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్తో త్వరలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ అధికారులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్లో వివాదాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గంభీర్, స్టాఫ్ తీరుపై పలువురు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ద్రవిడ్ టైమ్తో పోలిస్తే కమ్యూనికేషన్ సరిగా లేదని వస్తున్న ఆరోపణలపై దృష్టిసారిస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.