TOLLYWOOD: టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం
డ్రగ్స్ దందాలో ముగ్గురి నైజీరియన్స్ అరెస్ట్.... పరారీలో సినీ ప్రముఖులు.. ఉలిక్కిపడ్డ సినీ పరిశ్రమ;
మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులకు గత నెల 31న డ్రగ్స్ కేసులో సినీ ఫైనాన్షియర్ కె.వెంకటరత్నారెడ్డి, మరో నిందితుడు బాలాజీని అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించగా.. సినీ పరిశ్రమకు చెందిన పలువురికి నైజీరియన్లతో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. వెంకటరత్నారెడ్డి, బాలాజీలు ఇచ్చిన సమాచారంతో ముగ్గురు నైజీరియన్లు, మహబూబ్నగర్ మాజీ ఎంపీ విఠల్రావు కుమారుడు దేవరకొండ సురేశ్రావు, సినీ దర్శకుడు అనుగు సుశాంత్రెడ్డి, చిత్ర పరిశ్రమతో సంబంధాలున్న రాంచంద్, మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి కోటి విలువైన 8 గ్రాముల కొకైన్, 50 గ్రాముల MDMA, కార్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెంకటరత్నారెడ్డి బ్యాంకు ఖాతాలోని ఐదున్నర కోట్లు స్తంభింపజేశారు. సినీ నటుడు నవదీప్, షాడో చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి, స్నార్ట్ పబ్ యజమాని సూర్య, ముగ్గురు నైజీరియన్లు పరారీలో ఉన్నారని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నెల్లూరుకు చెందిన బి.బాలాజీ గతంలో ఇండియన్ నేవీలో అధికారిగా పని చేశాడు. కంటికి తీవ్రమైన గాయం కావడంతో మెడికల్లీ అన్ఫిట్ అయ్యాడు. దీంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచుగా హైదరాబాద్కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్లో రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా ఇతడికి హైదరాబాద్తో పా టు బెంగళూరు డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలు ఏర్ప డ్డాయి.
వెంకటరత్నారెడ్డి, బాలాజీ ఫోన్లలోని డేటా, ఇతర సమాచారం ఆధారంగా అమోబీ, మైఖేల్, థామస్లతోపాటు దేవరకొండ సురేశ్రావు, విశాఖపట్నం వాసి కొల్లి రాంచంద్, ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కూరపాటి సందీప్, అనుగు సుశాంత్రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన పోకర్ నిర్వాహకుడు పగళ్ల శ్రీకర్ కృష్ణప్రణీత్లను అదుపులోకి తీసుకున్నారు. 13 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటరత్నారెడ్డి, కూరపాటి సందీప్, సూర్య, కలహర్రెడ్డి, కృష్ణప్రణీత్ తదితరులు బాలాజీ నుంచి డ్రగ్స్ తీసుకుని.. పార్టీలు నిర్వహించేవారని పోలీసులు తెలిపారు
నైజీరియాకు చెందిన అమోబీ చుక్వుడి బెంగళూరులోని యెలహంక ఫుట్బాల్ క్లబ్లో సభ్యుడు. అఖిల భారత నైజీరియా విద్యార్థి, కమ్యూనిటీ సంఘం సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఇతడు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే తమ దేశస్థులకు బెయిల్ ఇప్పించేందుకు, స్వదేశానికి పంపేందుకు నిధులు సమీకరిస్తాడు. నైజీరియాకే చెందిన ఇగ్బావ్రే మైఖేల్, థామస్ అనఘా కలూలు.. అమోబీతో కలిసి బెంగళూరు, హైదరాబాద్లలోని పరిచయస్థులకు డ్రగ్స్ అమ్ముతుంటారు. వీరితో విశాఖపట్నం వాసి, వరంగల్లో నివాసముండే డ్రగ్స్ స్మగ్లర్ రామ్కిశోర్కు పరిచయం ఏర్పడింది.