హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టులో సోమవారం పందెం కోళ్లను వేలం వేశారు. మొత్తం 84 కోళ్లకు ఏకంగా రూ.16.65 లక్షలకు పందెం రాయుళ్లు వీటిని సొంతం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోల్కట్ట ఫామ్ హౌస్ లో గతవారం కోళ్ల పందెం నిర్వహిస్తున్న స్థావరంపై ఎస్టి మొయినాబాద్ పోలీసులు దాడిచేసి వీటిని పట్టుకున్నారు. ఆరోజు 61 మందిపై కేసు నమోదు చేసి 61 కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు అక్కడున్న పందెం కోళ్లను స్వాధీన పరుచుకున్నారు. రాజేంద్రనగర్ కోర్టులో కోళ్లను హాజరు పరిచారు. జడ్జి సమక్షంలో పందెం కోళ్లను వేలంవేశారు. 10 కోళ్ల చొప్పున వేలం నిర్వహించారు. మొదటి రౌండ్ కు రూ. 2 లక్షల 50 వేలు, రెండో రౌండ్ కు రూ. 3 లక్షల 75 వేలు, మూడో రౌండ్కి రూ. లక్షా 15వేలు. ఇలా మొత్తం 8 రౌండ్లకు కలిపి రూ. 16 లక్షల 65 వేలు వచ్చాయి. పోలీసు దాడుల్లో పట్టుబడిన వారే ఆ కోళ్లను కైవసం చేసుకోవడం కొసమెరుపు. జూదంలో పట్టుబడిన పందెం కోళ్లను పోలీసులు వేలం వేయడం ఇదే మొదటిసారి అని టాక్.