ఫార్ములా ఈ-కార్ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. గతనెలలో కూడా కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-రేస్ అంశంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఏసీబీ అధికారులు విచారించారు. ఫార్ములా ఈ రేసు అనేది పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఒక అంతర్జాతీయ మోటార్స్పోర్ట్ ఈవెంట్. హైదరాబాద్లో ఈ రేసు నిర్వహించడం ద్వారా నగరం అంతర్జాతీయ పటంలో ఒక ప్రముఖ కేంద్రంగా గుర్తింపు పొందుతుందని, పర్యాటకాభివృద్ధి జరుగుతుందని గత ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్లో నిర్వహించిన అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్లలో ఇది ఒకటి. 2023 ఫిబ్రవరిలో హుస్సేన్సాగర్ తీరాన ఉన్న లుంబిని పార్క్ చుట్టూ తాత్కాలిక ట్రాక్ను ఏర్పాటు చేసి ఈ రేసును అట్టహాసంగా నిర్వహించారు.