ముత్యాలమ్మ ఆలయంలో ఒంటికాలిపై పూజలు, శివతాండవం చేసి టీవీ, డిజిటల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ట్రెండింగ్ లో ఉన్న అఘోరీ నాగసాధు వ్యవహారం సంచలనం రేపుతోంది. అఘోరీ ఎవరు.. వారి తల్లిదండ్రులు ఎవరు.. స్వామీజీగా ఎప్పుడు మారారు అనేది తెలుసుకునేందుకు పలువులు జర్నలిస్టులు అఘోరీ సొంతూరికి వెళ్లారు. మంచిర్యాల జిల్లా కుశ్నపల్లిలో అఘోరీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, గ్రామస్తులతో మాట్లాడారు.
ఐతే.. అఘోరీ అసలు పేరు శ్రీనివాస్ అనీ.. చిన్నప్పుడు ఆరో తరగతిలోనే ఇంట్లోనుంచి వెళ్లిపోయాడని ఆ కుటుంబసభ్యులు చెప్పారు. తనకు నలుగురు కొడుకులు, ఓ కూతురని.. మూడో కొడుకే శ్రీనివాస్ అని ఆ తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు. స్వామీజీగా మారి పదిహేనేళ్ల తర్వాత ఇటీవలే తమ ఊరికి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారని చెప్పారు. ఐతే.. అఘోరీతో తాము మాట్లాడేందుకు కూడా వీలుండదని అన్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూసి బాధ కలుగుతోందని అంటున్నారు. అఘోరీ తమ ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాత ఊరిలోని అందరూ తమను విచిత్రంగా చూస్తున్నారని కూడా ఆ కుటుంబం తెలిపింది.