వరంగల్జిల్లాలో బండి సంజయ్ పర్యటన
కమలదళం ఇప్పుడు వరంగల్ను టార్గెట్ చేసింది.
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్పై తెలంగాణ బీజేపీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం వరంగల్లో పర్యటించనున్నారు. మొదట దుబ్బాకలో విజయం.. తరువాత బల్దియా ఎన్నికల్లో 4 నుంచి 45 సీట్లు సాధించడంతో ఫుల్ జోష్లో ఉన్న కమలదళం ఇప్పుడు వరంగల్ను టార్గెట్ చేసింది.
కడిపికొండ బ్రిడ్జి నుంచి అమరవీరుల స్థూపం వరకు బండి సంజయ్ ర్యాలీ చేపట్టనున్నారు. కాజీపేట, సుబేదారి, సీపీవో కార్యాలయం, హన్మకొండ చౌరాస్తా, ములుగురోడ్డు, ఎంజీఎ సర్కిల్, పొచమ్మమైదానం మీదుగా సుదీర్ఘంగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు విష్ణుప్రియ గార్డెన్లో జరిగే బీజేపీ సమావేశానికి బండి సంజయ్ హాజరవుతారు. ఈ సందర్భంగా 25 మందికి పైగా ఇతర పార్టీల్లో ఉన్న ప్రముఖులు కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరగంగల్లో పాగా వేసేందుకు బండి సంజయ్ పర్యటన ఉపయోగపడుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో ప్రచారం చేసే ఏ అవకాశాన్నీ బీజేపీ వదలడం లేదు. ఇప్పటికే కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. ఇటు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరినీ ఎండగట్టారు. ఇప్పుడు అధ్యక్షుడు బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు.