ఉత్కంఠకు తెర పడింది. బీజేపీ ఎల్పీ నేత ఎవరో తెలిపోయింది. బీజేపీ ఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బీజేఎల్పీ ఉపనేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి నియామకం అయ్యారు. శాసనమండలి పక్షనేతగా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి నియామకం అయ్యారు.
మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 30న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో ఆ జిల్లాకు చెందిన నేతనే బీజేఎల్పీ నేతగా నియమించారని తెలుస్తుంది.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి 1968లో నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలం, గాజుల్పేట్ గ్రామంలో జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1990లో బిఏ పూర్తి చేశాడు. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు మహేశ్వర్ రెడ్డి . 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.