బాలాపూర్ గణేషుడు లడ్డూ, వేలానికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. దీనికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రతీఏటా లడ్డును వేలం వేయడం లక్షల రూపాయల్లో ధర పలుకుతుంది. అయితే ఈ ఏడాది లడ్డు వేలానికి మండప నిర్వాహకులు కొత్త నిబంధనలను నిర్ణయించారు. ఆ నిబంధనలను పాటించే భక్తులు మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిఏటా బాలాపూర్ గణేషుని లడ్డూని వేలంలో దక్కించుకునేందుకు వేలాదిమంది భక్తులు పేరును నమోదు చేసుకుంటారు.
1980లో ఏర్పాటైన బాలాపూర్ గణేష్ ఉత్సవకమిటీ..1994 నుంచి లడ్డూ వేలం పాట పాడుతున్నారు. తొలి సారి జరిగిన వేలంలో కొలను మోహన్ రెడ్డి అనే రైతు లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత వేలం ఆనవాయితీగా ప్రతీ సంవత్సరం సాగుతోంది. గతేడాది 2023లో రూ.27 లక్షలకు లడ్డు ధర పలకగా దయానంద్ రెడ్డి అనే భక్తుడు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. బయటి వ్యక్తులు మాత్రమే లడ్డు వేలంలో పాల్గొనేందుకు డబ్బులను ముందుగా డిపాజిట్ చేసేవారు. అయితే ఈ సారి బాలాపూర్ గ్రామ ప్రజలతోపాటు లడ్డువేలంలో పాల్గొనే వారంతా ముందస్తు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకున్నాకే.. వేలం పాల్గొనాలని చెబుతున్నారు.
బాలాపూర్ లడ్డూకు ఓ ప్రత్యేకత ఉంది. బాలాపూర్ లడ్డూ పొందేందుకు భక్తులు ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారనేందుకు రీజన్స్ ఉన్నాయి. ఈ లడ్డూను సొంతం చేసుకున్నవారు పొలాల్లో, బావుల్లో చల్లుతారు. అంతా మంచే జరుగుతుందని.. దేవుడి కరుణ ఉంటుందని నమ్మకం. మొదటి బాలాపూర్ వినాయకుని లడ్డూని స్థానిక రైతులు ఎక్కువగా వేలం పాడేవారు. కాలానుగుణంగా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, రాజకీయ నాయకులు బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొని ఎంత మొత్తమైనా సరే చెల్లించి లడ్డూను దక్కించుకునేందుకు సిద్దపడేవారు. బాలాపూర్ గణేషుని లడ్డూకు...ఈ సారి రూ.27 లక్షలు ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.