Telangana: కే. కేశవరావు ఇద్దరు కుమారులపై పోలీసు కేసు
కె.కేశవరావు కుమారులు విప్లవ్కుమార్ ఎ-1, వెంకటేశ్వర్రావును ఎ-2గా చేర్చారు;
ఎంపీ కె.కేశవరావు ఇద్దరు కుమారులపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని ఎన్బీటీనగర్ సర్వే నంబరు 129 లో షేక్ అలీఖాన్ అహ్మద్ నుంచి 939 గజాల స్థలాన్ని బంజారాహిల్స్కు చెందిన లేట్ సుదర్శన్రెడ్డి 470 గజాలు, బంజారాహిల్స్ రోడ్ నంబరు 13లో నివసించే జయమాల 469 గజాల స్థలాన్ని 1983లో సంయుక్తంగా కొన్నారు.
సుదర్శన్రెడ్డి దక్షిణం, జయమాల ఉత్తరం వైపు భాగాలు తీసుకున్నారు.ఆ తర్వాత జయమాల అమెరికాలో స్థిరపడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 13లోని జయమాల నివసించిన ఇంటికి గతేడాది ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2 కోట్ల13లక్షల67వేల500లకు స్థలాన్ని అమ్మారని,పెట్టుబడి మీద వచ్చిన లాభానికి సంబంధించి చెల్లించాల్సిన పన్ను, పెనాల్టీ.. కోటి నలభై రెండు లక్షలు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు చూసిన ఆమె షాక్ గురై కొద్దిరోజుల క్రితం హైదరాబాద్కి వచ్చారు.
2019లో ఎంపీ కె.కేశవరావు కుమారుడు తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ విప్లవ్కుమార్కు స్థలంపై స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తాను ఇచ్చినట్లు ఉన్న పత్రాలు జయమాల గమనించారు. జులై 19, 2013లో ఆ స్థలాన్ని తన సోదరుడు వెంకట్కు 3 లక్షలకు విక్రయించిన రిజిస్టర్ దస్తావేజులను ఆమెకు గుర్తించారు. వీటిలో తన సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇటీవల మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో గతనెల 13న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కె.కేశవరావు కుమారులు విప్లవ్కుమార్ ఎ-1, వెంకటేశ్వర్రావును ఎ-2గా చేర్చారు.