KCR : టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఏకగ్రీవం కానున్న సీఎం కేసీఆర్....!
KCR : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా సీఎం కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయన ఒక్కరి పేరిటే మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి.;
KCR(Tv5news.in)
KCR : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా సీఎం కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయన ఒక్కరి పేరిటే మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. మరో అభ్యర్థి ఎవరూ నామినేషన్ వేయలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పార్టీ అధ్యక్ష పదవికి ఈ నెల 17 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.... మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... సీఎం కేసీఆర్ పేరిట నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న చివరి రోజు కూడా రెండు నామినేషన్లు వచ్చాయి. మొత్తం 18 నామినేషన్లను ఇవాళ పరిశీలించనున్నారు. ఉపసంహరణకు రేపటి వరకు గడువు ఉంది. ఈ నెల 25న హెచ్ఐసీసీలో జరిగే పార్టీ ప్లీనరీలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లన్నీ సీఎం కేసీఆర్ పేరిటే ఉండటంతో... కేసీఆర్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.
పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారంపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. సీఎం ఆదేశాల మేరకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో అధికారుల బృందం పోడు భూములపై క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. దీనిపై సీఎం కార్యాలయానికి నివేదిక కూడా సమర్పించింది. పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజనుల సమస్యలపైనా ప్రజాప్రతినిధులు నివేదించారు. వీటన్నింటిపైనా సీఎం చర్చించి, సమగ్ర కార్యాచరణను ప్రకటించనున్నారు.