కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ పై స్పందించిన ఆయన.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారన్నారు. కేంద్రం మొదటి నుంచి తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు. ప్రధాని తెలంగాణకు వస్తే స్వాగతం పలికి పెద్దన్న పాత్ర పోషించమని అడిగామన్నారు. పెద్దన్నలా ఉండాల్సిన ప్రధానికి ఇది సరికాదన్నారు . ‘రాష్ట్రానికి నిధుల కోసం మంత్రులు 18 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీని నేనే మూడుసార్లు కలిసి తెలంగాణకు అవసరమైన నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా. కానీ, తెలంగాణ అనే పదం పలకడానికే కేంద్రం ఇష్టపడటం లేదు. ఏ రంగానికీ సహకారం అందించట్లేదు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారా?’ అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
మూసీకి నిధులు అడిగినా ఇవ్వలేదు..
గుజరాత్కు ఎలా నిధులు కేటాయించారో మూసీకి అలా నిధులు కేటాయించామని ప్రధాని మోదీని తాను అడిగినట్లు సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్కు నిధులు ఇస్తే దేశ ఎకానమికి ఉపయోగపడుతుందని మోదీకి వివరించినట్లు తెలిపారు. ‘పదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఐటీఐఆర్ కారిడార్ మరుగున పడింది. ఏపీకి ఎందుకు నిధులు ఇస్తున్నారు? అని మేం అడగడం లేదు. పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టు ఏపీకి నిధులు కేటాయించారు. తెలంగాణ విషయంలో ఇంత కక్ష ఎందుకు? పునర్విభజన చట్టం తెలంగాణకు వర్తించదా? అని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. బడ్జెట్ను మరోసారి సవరించి తెలంగాణకు నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటివరకు కాంగ్రెస్ ఎంపీ పోరాడుతూనే ఉంటారన్నారు.