TG: గవర్నర్‌తో సీఎం రేవంత్‌ భేటీ

కొత్త గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి... శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌రెడ్డి;

Update: 2024-07-29 04:30 GMT

తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 9 గంటలకు గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కొత్త గవర్నర్ నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నట్లు ట్వీట్ ద్వారా రేవంత్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 31న రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయిస్తారు. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాష్ట్రానికి చెందినవాడు. ఆయన గతంలో త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. జిష్ణు దేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబంలో సభ్యుడు. 1990లో రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా బీజేపీలో చేరారు.

ప్రస్తుతం తెలంగాణ ఇన్ చార్జి గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ఇవాళ రిలీవ్ కానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీపీ రాధాకృష్ణన్ ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు. రాధాకృష్ణన్ సహా మొత్తం 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌కు వీడ్కోలు పలికేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. కాగా, రాధాకృష్ణన్ బోనాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహంకాళి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, రాష్ట్రం పంటలతో సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. ఎన్నో రాష్ట్రాలకు సేవలందించడం గర్వకారణమన్నారు. తన చివరి శ్వాస వరకు దేశ సేవలోనే పనిచేస్తానని చెప్పారు. నిన్నటి వరకు తెలంగాణ, జార్ఖండ్, పుదుచ్చేరి రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన ఆయనను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News