Revanth Reddy: ప్రతి జిల్లాలోనూ హైడ్రా

తెలంగాణలో ఆక్రమణలు తొలగనున్నాయా?;

Update: 2024-09-04 06:00 GMT

ఓ వైపు భారీ వ‌ర్షాలు. మ‌రోవైపు ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంక‌లు. జ‌నావాసాల్లోకి భారీ వ‌ర‌ద నీరు. ఇళ్లన్నీ జ‌ల‌మ‌యం. ఇవ‌న్నీ చూసిన త‌ర్వాత అంద‌రి మ‌దిలో త‌ట్టింది హైడ్రానే. ఎందుకు..? చెరువులు, కుంట‌లు ఆక్రమించేసి ఎడాపెడా అక్రమ నిర్మాణాలు, బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు క‌ట్టేసిన పాప‌మే ఇలా ఇళ్లు, కాల‌నీలు మునిగిపోవడానికి కారణమని ప్రజల ఆలోచన. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన హైడ్రా.. అది హైద‌రాబాద్‌లో కూల్చిన అక్రమ నిర్మాణాలు గుర్తుకు వ‌చ్చి బ‌హుబాగు ఇలా చేస్తేనే త‌ప్ప వ‌ర‌ద‌ల ప్రమాదాలు, ఇబ్బందుల‌కు మోక్షం లేద‌నే విధంగా చ‌ర్చించుకుంటున్నారు. స్టాండ్ విత్ హైడ్రా అంటూ అన్ని వ‌ర్గాల నుంచి ప్రభుత్వానికి మ‌ద్దతు కూడా ల‌భిస్తోంది. ఇదే క్రమంలో సీఎం రేవంత్ దీన్ని జిల్లాల‌కు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సంచ‌ల‌న ప్రక‌ట‌న చేయ‌డంతో ఇది చ‌ర్చనీయాంశ‌మైంది. జిల్లా క‌లెక్టర్లకే ఈ బాధ్యత‌ను అప్పగించాడాయ‌న.

ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ముందుకెళ్తాం

ప్రకృతిని చెర బ‌డితే అది ప్రకోపిస్తుంద‌ని.. ప్రకృతి ప్రకోపంతోనే ఉత్తరాఖండ్‌లోనైనా, మ‌న ద‌గ్గరైనా చెరువులను కబ్జా చేయడం వల్లే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని సీఎం రేవంత్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ముందుకెళ్తోందని అన్నారు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించచాలనే డిమాండ్ వస్తోందని.. త్వరలోనే జిల్లాల్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఖమ్మం పర్యటనలో సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్ లో కేవ‌లం ఒక నాలాపైనే ఆక్రమ‌ణ‌లు తొలగిస్తేనే రాం న‌గ‌ర్‌లో ముంపు బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన విష‌యాన్ని ముఖ్యమంత్రి ఉదాహ‌రించారు.

ఖమ్మం మునగడానికి ఆయనే కారణం..

ఖ‌మ్మం ముంపు బారిన ప‌డ‌డానికి మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమ‌ణ‌లే కార‌ణ‌మ‌ని త‌న‌కు ఫిర్యాదులు అందాయ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి ఇష్టారీతిగా కాలువ‌లు ఆక్రమించార‌ని, దాంతో ఖ‌మ్మం ముంపు బారిన ప‌డింద‌ని తాను ప‌రామ‌ర్శిస్తున్నప్పుడు స్థానికులు చెప్పార‌న్నారు. ఖ‌మ్మంలో పువ్వాడ ఆక్రమ‌ణ‌ల‌కు సంబంధించి వాస్తవాలు వెలికితీయాల‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, జిల్లా క‌లెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు… తాము అధికారంలోకి వ‌చ్చాక తొలిసారిగా వేసిన టెండ‌ర్ ఖ‌మ్మం మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుకేన‌ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం అంత‌కు మించిన ఎత్తులో నీరు వ‌చ్చినందున.. ఆ ఎత్తు పెంపు స‌మీక్షిస్తామ‌ని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.

Tags:    

Similar News