TG : ఈ నెల 16న ఢిల్లీకి సీఎం రేవంత్ .. మంత్రి వర్గ విస్తరణపై చర్చించే అవకాశం
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పు తదితర అంశాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చించే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా రోజులుగా ఏఐసీసీ కసరత్తు చేస్తున్నప్పటికీ.. సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 16న మరోసారి సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు. అలాగే, నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పటికే 27 పేర్లతో ఓ జాబితా సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.