తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారం రోజుల పాటు ఫారిన్ టూర్ లో గడపనున్నారు. సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్ళనున్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు సీఎం రేవంత్ హజరవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అంతర్జాతీయ వేదికపై రెండోసారి ప్రసంగిస్తారు సీఎం రేవంత్. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై వివరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రాధాన్యతపై వివరిస్తారు.
నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన ప్లాన్పై దావోస్ వేదికగా సీఎం రేవంత్ కీలక చర్చలు జరుపనున్నారని సమాచారం. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులే లక్ష్యంగా జనవరి 16 నుంచి 19 వరకూ సింగపూర్లో పర్యటిస్తారు సీఎం రేవంత్రెడ్డి . స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. జనవరి 20 నుంచి 22 వరకూ దావోస్ లో పర్యటిస్తారు సీఎం రేవంత్రెడ్డి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.
గత ఏడాది దావోస్ సదస్సులో కుదిరిన ఒప్పందాలతో 40 వేల 232 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంటే.. ఇప్పటికే 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మరో 10 ప్రాజెక్టులు పట్టాలకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.