వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన రాళ్ల దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి జరిగిన పరిణామాలపై మంగళవారం రాష్ట్ర డీజీపీ జితేందర్, నిఘా వర్గాల ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాత్రి టైంలో మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు మాయ మాటలు చెప్పి తీరా అక్కడికి వెళ్లాక నిర్బంధించి వారిపైన, వారి వాహనాలపై దాడులకు ఉసిగొల్పినవారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దాడుల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. దాడుల వెనుక ఉన్న ప్రధాన నిందితుడికి బీఆర్ఎస్ సంబం ధాలున్నాయని తెలుస్తోందని అన్నారు. అధికారులను హతమార్చాలని చూసినవారికి బీఆర్ఎస్ ఎలా మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు. అధికారులపై రాళ్ల దాడికి ప్రయత్నించినవారు ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.
కుట్రపూరితంగా, పకడ్బందీగా ప్లాన్ చేసి వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేశారని ఐజీ సత్యనారాయణ చెప్పారు. ఇలాంటి దాడి ఇంతకుముందెన్నడూ జరగలేదన్నారు. 16 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితులపై మూడు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టామని చెప్పారు. ప్రధాన నిందితుడు సురేశ్ రాజు.. కలెక్టర్ ను మిస్ లీడ్ చేసి గ్రామంలోకి తీసుకెళ్లి దాడి చేయించాడని చెప్పారు. అతడి కోసం గాలిస్తున్నామని..ఫోన్ డేటా ఆధారంగా ఎంతదూరమైనా, వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని చెప్పారు.