ప్రజాస్వామిక దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ముందుకు సాగాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలోనూ కలిసికట్టుగా ముందుకు సాగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల అనుబంధం విడదీయరానిదని.. ఇది భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 1976లో జరిగిన మగ్ధూంభవన్ ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు పాల్గొన్నారని.. ఇప్పుడు తాను పాల్గొన్నట్లు గుర్తు చేశారు. మఖ్ధూం మొహియుద్దీన్ తన జీవితాంతం ప్రజల కోసమే పనిచేశారని.. ప్రజా భవనాలు, కమ్యూనిస్టు ఆస్తులు ప్రజలకు ఉపయోగపడేవని చెప్పారు. కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు కూడా బలపడాలని కోరుకునే వ్యక్తిని అని.. కమ్యూనిస్టు భావజాలానికి మరణం లేదని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ బంధాన్ని ప్రజలు కూడా నమ్మి గెలిపించారని చెప్పారు.