CONGRESS: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధం.
రేపటి నుంచే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం... శుక్రవారం ఉమ్మడి అదిలాబాద్లో సీఎం సభ
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేవబోతోంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో కదలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లో తన పట్టు మరింత బలపరచుకోవడమే లక్ష్యంగా గెలుపు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతూ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించబోతోంది. ఈ సభతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, రాబోయే ఎన్నికలపై స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రచార బాధ్యతలు చేపట్టడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుతోనే జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అన్ని మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార విధానం వరకు ప్రతి అంశంపై పార్టీ అంతర్గతంగా విస్తృత చర్చలు జరుపుతోంది. ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ను గెలిపించే బాధ్యతను ముఖ్యనేతలకు అప్పగించనున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో రెబెల్స్ కారణంగా కొన్నిచోట్ల ప్రతిపక్షాలు లాభపడ్డాయని.. మున్సిపాలిటీల్లో అది పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీనియర్ నాయకులు చెప్పారు. ప్రధానంగా స్థానిక నేతల మధ్య అభిప్రాయభేదాలు ఇతర పార్టీలకు ఉపయోగపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పీసీసీ గట్టి నిర్ణయం తీసుకుంది. ఏ మున్సిపాలిటీలో నేతల మధ్య సఖ్యత ఎలా ఉంది, ఎవరు ఎంతమంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారనేది ముందే చెప్పాలని కోరింది. ఒక్కో వార్డుకు ఐదు నుంచి ఆరుగురు ఆశావహులను ఎంపిక చేయాలని సూచించింది.
కానీ వీరిలో ఒకరికి టిక్కెట్ ఇస్తే మిగిలినవారు రెబెల్స్గా బరిలోకి దిగి పార్టీని నష్టపరచకుండా.. ముందే వారిని ఒకతాటిపైకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆశావహుల పేర్లను సూచించే సమయంలోనే వారిలో ఎవరైనా ఒకరిపై ఇతరుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందా అనేది పరిశీలించనున్నారు. పరస్పరం వ్యతిరేకించేవారిలో ఒకరికి టిక్కెట్ ఇస్తే అసంతృప్తికి గురయ్యేవారిని బుజ్జగించి రెబెల్గా బరిలోకి దిగకుండా చూడటంతోపాటు, వారిని ప్రచారానికి తీసుకెళ్లే బాధ్యతలను సైతం జిల్లా ముఖ్యనేతలే తీసుకోవాలని పీసీసీ సూచించినట్లు తెలుస్తోంది.