కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ భూముల్లో జరుగుతున్న పనులపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టి అన్నిరకాల కార్యకలాపాలపై స్టే విధించింది. కంచ గచ్చిబౌలి భూములపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాకలు చేసింది. అటవీ భూమి కాదని, జంతువులు లేవని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీంతో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది.
ఈ కేసు సుప్రీంకోర్టు ముందు విచారణకు వస్తున్న నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు మంగళవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్, సీఈసీ దాఖలుచేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.