Komuravelli : కొమురవెల్లి మల్లన్న బ్రహ్మాత్సవాలకు భారీగా వచ్చిన భక్తులు

Update: 2025-03-24 11:45 GMT

కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రాంగణం తోటబావి వద్ద అగ్ని గుండాలను నిర్వహించారు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి తెల్లవారుజామున ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి అగ్నిగుండాల వద్ద పెట్టి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను పట్టుకుని అగ్నిగుండాలు దాటిన తర్వాత.. భక్తులు అగ్నిగుండాలు దాటి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో మూడు నెలలుగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు అగ్నిగుండాల కార్యక్రమంతో జాతర ముగిసింది.

కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జనవరి 19న ప్రారంభమయ్యాయి. దాదాపు మూడు నెలలపాటు సాగిన జాతర ఉత్సవాలు ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగుస్తాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆదివారం ఆలయంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించుకుంటారు. పట్నం వేసి కల్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభమై 10 ఆదివారాలు కొనసాగాయి. 10 ఆదివారాలతోపాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చివరి వారం కావడంతో భక్తులు స్వామి వారి క్షేత్రానికి భారీగా చేరుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అగ్ని గుండాల మీదుగా నడిచి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పట్టింది. గుట్టపై భాగంలో ఉన్న ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Tags:    

Similar News